Tuesday 27 December 2016

12 పంచవర్ష ప్రణాళికలు

పంచవర్ష ప్రణాళికలు
1వ పంచవర్ష ప్రణాళిక (1951-56): వ్వవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. దీనిని హారడ్‌-డోమర్‌ వృద్ధి నమూనా ఆధారంగా రూపొందించారు. ఈ ప్రణాళికలోనే సేంద్రియ ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ కర్మాగారం నిర్మాణం జరిగింది. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 2.1% కాగా 3.6% సాధించారు. 
2వ పంచవర్ష ప్రణాళిక(1956-61): మౌళిక,భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత కల్పించారు. ఈ ప్రణాళికలోనే రూర్కెలా, భిలారు, దుర్గాపూర్‌ లలో మూడు ఉక్కు కర్మాగారాల నిర్మాణం జరిగింది. దీనిని మహలనోబిస్‌ నమూనా ఆధారం గా రూపొందిం చారు. దీనిని ధైర్యంతో కూడుకున్నప్రణాళికగా (Bold Plan), ప్లాన్‌ ఆఫ్‌ ఇండిస్టీ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పేర్కొంటారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 4.5% కాగా 4.21% సాధించినారు.

3వ పంచవర్ష ప్రణాళిక(1961-66): సంతులిత వృద్ధి, స్వావలంబన సాధించడానికి వీలుగా కేటాయింపులు చేశారు. ఈ ప్రణాళికా కాలంలో రుతుపవనాలు అనుకూలించకపోవడంతోపాటు, 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల కారణంగా ప్రణాళికా లక్ష్యాలు నెరవేరలేదు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6% కాగా 2.8% సాధించినారు.

వార్షిక ప్రణాళికలు: 3 పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక అమలుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో 1966-69 మూడు సంవత్సరాలకు గాను మూడు వార్షిక ప్రణాళికలను రూపొందించారు. ఈ కాలాన్ని ప్రణాళికా విరామం ( Plan Gap) లేదా ప్రణాళికా సెలవు (Plan holiday) అంటారు.

4వ పంచవర్ష ప్రణాళిక (1969-74): సుస్థిర వృద్ధి, స్వయం పోషకత్వాన్ని ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రణాళికా కాలంలోనే ''గరీబీ హటావో'' నినాదాన్ని నాటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఇచ్చింది. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.7% కాగా 3.3% సాధించారు.
5వ పంచవర్ష ప్రణాళిక (1974-79): పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా రూపకల్పన చేశారు. కనీస అవసరాలు తీర్చే కార్యక్రమం (Minimum Needs Programme), 20 అంశాల ఆర్థిక కార్యక్రమం మొదలైన వాటిని ఈ ప్రణాళికలో అమలు చేశారు. 1975లో అత్యవర పరిస్థితి విధించడం, 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో దీనిని 1978లో ఒక సంవత్సరం ముందుగానే ముగించారు.

1977లో అధికారంలోనికి వచ్చిన జనతా ప్రభుత్వం 1978-83 సంవత్సరాలకు గాను 6వ పంచవర్ష ప్రణాళికను నిరంతర ప్రణాళిక (Rolling Plan) రూపంలో అమలుకు రూపకల్పన చేశారు. అయితే జనతా ప్రభుత్వం పతనం కావడం తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోనికి రావడం వల్ల 1978-79, 1979-80 రెండు సంవత్సరాలను వార్షిక ప్రణాళికలుగా పరిగణిస్తారు. 

6వ పంచవర్ష ప్రణాళికలో (1980-85) నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత కల్పించినారు.ఉపాధి కల్పనకు అనేక పథకాలను ఈప్రణాళికలో చేపట్టారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.2% కాగా 5.7% సాధించారు.
7వ పంచవర్ష ప్రణాళిక (1985-90): ఆహారం, పని, ఉత్పాదకతలను మౌళిక ప్రాధాన్యతలుగా గుర్తించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.% కాగా 6.02% సాధించారు. రాజకీయ సుస్థిరత లేకపోవడం వల్ల 1990-91,1991-92 రెండు సంవత్సరాలకుగాను వార్షిక ప్రణాళికలను అమలుచేశారు.

8వ పంచవర్ష ప్రణాళికలో (1992-97) మానవ వనరుల అభివృద్ధితో పాటు పేదరిక, నిరుద్యోగ నిర్మూలన ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నారు. 1991 నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేటు రంగానికి ఎక్కువ బడ్జెట్‌ కేటాయించారు. ఈ ప్రణాళిక నుండే సూచనాత్మక ప్రణాళికను అమలు చేశారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6% కాగా 6.68% సాధించారు.
9వ పంచవర్ష ప్రణాళికలో (1997-2002) సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడుకున్న వృద్ధిని ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 6.5.% కాగా 5.5% సాధించినారు. 
10వ పంచవర్ష ప్రణాళికలో (2002-07) ప్రాంతీయ అసమానతల తొలగింపు ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 8% కాగా 7.8% సాధించారు. 

11వ పంచవర్ష ప్రణాళికలో (2007-12) అన్ని రంగాలలో సమ్మిళిత వృద్ధి రేటును సాధించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించినారు. 8.1% వృద్ధి సాధించారు. 

12వ పంచవర్ష ప్రణాళికలో (2012-17) వేగవంతమైన, స్థిరమైన, సమ్మిళిత వృద్ధి రేటును సాధించడం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. ప్రణాళిక వృద్ధి లక్ష్యం 9%గా నిర్ణయించారు.

x

No comments:

Post a Comment