Thursday 7 September 2017

9 నుంచి వ్యవసాయ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌


📚 9 నుంచి వ్యవసాయ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌

📚వ్యవసాయ విద్య అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 9 నుంచి 13 వరకు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, డాక్టరు వైఎస్సాఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నాయి. ఏపీ ఎంసెట్‌-2017లో ర్యాంకులు సాధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు ప్రత్యేక కేటగిరి అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. లాం ఫాం ఆడిటోరియంలో వీటిని నిర్వహిస్తారు.

📚మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 107 సీట్లతో పాటు 6 ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు, 4 ఉద్యాన కళాశాలల్లోని 390 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌ తేదీలు, ఫీజు, ఇతర సమాచారం కోసం www.angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ టి.వి.సత్యనారాయణ సూచించారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌷జీవో 64 రద్దు.. 16 కొనసాగింపు!

🌷వ్యవసాయ కళాశాలలకు సంబంధించిఎప్పటిలాగే జీవో 16 అమలులో ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల విద్యార్థుల వినతి మేరకు జీవో 64ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టదలిచిన సమ్మెను విరమిస్తున్నట్లు 11 వ్యవసాయ కళాశాలల విద్యార్థులు చెప్పారని తెలిపారు.

🌷వ్యవసాయ కళాశాలలపై త్రిసభ్య కమిటీని నియమించినట్టు చెప్పారు. కమిటీ నివేదిక పరిశీలించి, ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కళాశాలలపై ఒకే చట్టాన్ని తేవాలని కేంద్రం కూడా యోచిస్తోందన్నారు. కాగా, జీవో 64ను రద్దు చేయించేలా ప్రభుత్వంతో చర్చించాలని కోరుతూ వ్యవసాయ విద్యార్థులు ఇటీవల హైదరాబాద్‌లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

🔹పవన్‌ ధన్యవాదాలు

🌷వ్యవసాయ విద్యార్ధులకు సంబంధించి జీవో 64ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. 64జీవో రద్దుకు చొరవ తీసుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ విద్యార్ధులకు మంచి భవిష్యత్తు ఉందని, రాష్ట్ర రైతులకు ఉపయోగపడేలా కృషి చేయాలని సూచించారు.

🔹జీవో 64.. అంటే?

🌷కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాకుండా దేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు 71 ఉన్నాయి. వీటికి భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్‌) గుర్తింపు ఉండాలి. అయితే కొన్ని ప్రైవేటు, పలు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు యూజీసీ గుర్తింపుతో నడుస్తున్నాయి. అగ్రి విద్యార్థుల ఉన్నత విద్యలో సీట్ల భర్తీ, వ్యవసాయ సంబంధ ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు విషయంలో ఐసీఏఆర్‌ అక్రిడేషన్‌ తప్పనిసరి. దీనిపై ఏపీలో జీవో16 అమలుల్లోఉండేది. అయితే, యూజీసీ గుర్తింపు మాత్రమేఉన్న కాలేజీల విద్యార్థులూ..ఉద్యోగాలకు అర్హులేనంటూ జీవో 16కు సవరణగా గత జూలై 27న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ 64 జీవోను జారీ చేశారు. ఈ నిర్ణయమే వివాదానికి కారణమయింది.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

📚ఇంజనీరింగ్‌ విద్యకు మరమ్మతు

📚తుప్పుపట్టిన ఇంజనీరింగ్‌ సిలబ్‌సకు కొత్తరూపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 11 సబ్జెక్టుల్లో సిలబస్ ను అధ్యయనం చేసేందుకు నియమించిన 11 కమిటీలు సిలబస్‌ మార్పు చేయాలన్న సూచనలకు కేంద్ర మానవ వనరుల శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ఆమోదం తెలిపాయి. థియరీ సబ్జెక్టులను తగ్గించి ప్రాక్టికల్‌ బోధనకు ప్రాధాన్యత కల్పించాలని, కృత్రిమ మేధస్సు, మెషీన్‌ లర్నింగ్‌, ఇంటర్న్‌షిప్ పై దృష్టి సారించాలని కమిటీలు సూచించాయి. కమిటీల నివేదిక ప్రకారం.. మొదటి సంవత్సరంలో విద్యార్థులకు తక్కువ థియరీ క్లాసులుంటాయి. తొలి సెమిస్టర్‌లో ఇండక్షన్‌ ట్రైనింగ్‌కు వెళ్లాలి. చివరి సెమిస్టర్‌లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌ జాగ్రత్తగా చేయడానికి వీలుగా కమిటీలు సిలబ్‌సను రూపొందించాయని మానవ వనరుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. అవసరంలేని అంశాలను సిలబస్‌ నుంచి తొలగించాయన్నారు.

📚కాగా, ఈ నమూనా సిలబ్‌సను అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు, టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ పాటించాల్సిందే అన్నారు. ఏఐసీటీఈ త్వరలో నిబంధనలు జారీ చేస్తుందన్నారు. కేంద్రం నిర్దేశించిన సిలబ్‌సలో 70%ను కాలేజీలు తప్పనిసరిగా అనుసరించాలి. మిగతా 30% సిలబ్‌సను స్థానిక అవసరాల మేరకు బోధించాల్సి ఉంటుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు మినహా దేశంలోని అన్ని సాంకేతిక విద్యా సంస్థలకు కొత్త సిలబస్‌ వర్తించనుంది. ఈ అంశానికి సంబంధించి త్వరలో కాలేజీలతో ఏఐసీటీఈ సమావేశం నిర్వహించనుంది.
తుదినిర్ణయం తర్వాత వచ్చేఏడాది జనవరి నుంచి కొత్త సిలబస్‌ అమలు చేస్తారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇంజనీరింగ్‌ విభాగంలో రోజురోజుకూ కొత్త సాంకేతికత పుట్టుకొస్తోంది. కొన్ని కాలేజీలు దశాబ్దాల నాటి పాత సిలబస్ నే బోధిస్తున్నాయి. దాని వల్ల ఇంజనీరింగ్‌ పట్టాలు సాధించినా విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం సిలబస్‌మార్పునకు శ్రీకారం చుట్టింది’’ అని వ్యాఖ్యానించారు.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

 ✍సమాచార కమిషన్‌లో పోస్టుల మంజూరు

✍ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌లో ముఖ్య సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్లు సహా వివిధ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక ముఖ్య సమాచార కమిషనర్‌తో పాటు, ముగ్గురు సమాచార కమిషనర్ల పోస్టులు మాత్రమే మంజూరుచేసింది. ముఖ్య సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్లను ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఎంపిక చేస్తుందని పేర్కొంది. వీరితో పాటు ఇద్దరు కార్యదర్శులు, సహాయ కార్యదర్శి, అకౌంట్స్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ సూపరిటెండెంట్‌, రెండు సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, రెండు సీనియర్‌ అకౌంటెంట్‌, నాలుగు వ్యక్తిగత కార్యదర్శులు, నాలుగు వ్యక్తిగత సహాయకులు, 25 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, 20 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను మంజూరు చేసింది.

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

📚 పీజీ కంప్యూటర్‌ కోర్సు వచ్చేసింది

📚వెనకబడిన పల్నాడు ప్రాంతానికి సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న కంప్యూటర్‌ ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో నరసరావుపేట తర్వాత మాచర్ల ఎస్‌కేబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈ అవకాశం లభించింది. పీజీ చదువులో ఎంఎస్‌ఈ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు మాచర్లకు కేటాయించారు. శ్రీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా ఈ కోర్సు అందుబాటులో లేదని మాచర్ల కళాశాల కంప్యూటర్‌ అధ్యాపకుడు నాగరాజు తెలిపారు. మాచర్ల కళాశాలకు పీజీ కంప్యూటర్‌ కోర్సు వచ్చిన నేపథ్యంలో ప్రిన్సిపల్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన ఈ ప్రాంతంలో ఈ కోర్సు ప్రయోజనకరంగా పేర్కొన్నారు.

🔹పల్నాడుకు ప్రయోజనం

📚మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పీజీ కంప్యూటర్‌ కోర్సు రావడం కలిసి రానుంది. డిగ్రీ తర్వాత కంప్యూటర్‌లో పీజీ కోర్సు చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి రావాల్సిందే. ప్రస్తుతం మాచర్ల అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మాచర్ల, వినుకొండ, గురజాల, సత్తెనపల్లితో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల వారికి వెసులుబాటుగా ఉండబోతుంది. ఫీజులు విషయంలో రీఎంబర్స్‌మెంట్‌ అవకాశం ఉంది. దీంతో ఫీజులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2018- 2019 సంవత్సరంలో ఈ పీజీ విద్య అందుబాటులోకి రానుంది.

No comments:

Post a Comment